మెదక్,నవంబర్ 1: తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించి, పార్లమెంటులో పెప్పర్ స్ప్రేతో హల్ చల్ చేసిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాను తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. మెదక్ ప్రజలు తనను కోరుకుంటున్నారని చెప్పారు. అంతేకాకుండా భావోద్వేగాలతో కూడా ఆంధ్రా పాలిటిక్సుకు తాను దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
లగడపాటి ఈ రోజు విలేకర్లతో పలు అంశాలపై మాట్లాడారు. ‘మెదక్ జిల్లా ప్రజలు నన్ను తెలంగాణలో పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఎంపీగా పోటీచేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నేను కేవలం ఆంధ్రా రాజకీయల నుంచే తప్పుకున్నాను.. తెలంగాణలో ప్రజలు కోరుకుంటే తప్పకుండా ఎన్నికల్లో పోటీ చెస్తాను..’ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్న లగడపాటి ఇప్పుడు కొత్త పాట పాడడం విశేషం. ఏపీ విభజన తర్వాత లగడపాటి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కాగా, తనకు ఆపాదిస్తూ వస్తున్న సర్వేలను ఆయన కొట్టి పడేశారు. సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో డిసెంబర్ 7న పోలింగ్ అయ్యాక.. రాత్రికి తన సర్వే ఫలితాలను బయటపెడతానన్నారు. పార్టీలు కోరితే అంతకు ముందే ఇస్తానని ఊరించారు.