బాబు మోహన్ కు షాక్ ఇచ్చిన గ్రామ ప్రజలు

SMTV Desk 2018-10-31 14:34:45  TRS, BJP, Babu mohan, MLA

ఆందోల్, అక్టోబర్ 31: తాజాగా టీఆర్‌ఎస్ పార్టీని నుండి బీజేపీ లోకి వెళ్ళిన బాబు మోహన్ రాబోతున్న ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ తరపున ఆందోల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. ప్రచారంలో భాగంగా ఇటీవల నియోజకవర్గంలోని ఓ గ్రామానికి వెళ్లిన బాబుకు ఆ గ్రామ ప్రజలు పెద్ద షాక్ ఇచ్చారు.



ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో గ్రామస్తులతో మాట్లాడుతూ.. ‘నాకు ఓట్లు వేయండి. నన్ను గెలిపించండి. మీ బతుకులు మారుస్తా’ అని మాటలు కోటలు కడుతుండగా.. గ్రామస్తులకు చిర్రెత్తుకొచ్చింది. ‘ఏం మొహం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడగడానికి వచ్చావు. నాలుగేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన నువ్వు నియోజకవర్గానికి ఏం చేశావు. మా గడ్డం తెల్లబడినప్పటి నుంచి నీ వెనకే తిరుగుతున్నాం. నీకే ఓటు వేశాం. అయినా నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరగలేదు. ఎన్నికల సమయంలో కాళ్లు మొక్కే నువ్వు.. గెలిచాక కాలితో తన్నావు.. ఇప్పుడు మళ్లీ నిన్ను గెలిపించి.. తన్నించుకునేంత ఓపిక లేదు. మాకు మాటలు చెప్పే నాయకుడు వద్దు. అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. మాకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి..’ అని ప్రశ్నించారు. దీనికి బాబు మోహన్ స్పందిస్తూ.. ‘నాకు ఓట్లు వేయకపోతే మీ కర్మ’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.