హైదరాబాద్, అక్టోబర్ 30: తెలంగాణాలో రాబోతున్న ఎన్నికల సందర్బంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి, ఎన్నికల ఖర్చు రూ. 28లక్షలు మించదని ఎన్నికల సంఘం ప్రతిపాదిచింది. అంతేకాకుండా ఆహార పదార్థాలపై కూడా ధరలను తగ్గించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఈ మేరకు టీ లేదా కాఫీ రూ. 6, ఇడ్లీ రూ. 10, వడ రూ. 15, వాటర్ బాటిల్ రూ. 10, వెజ్ బిర్యానీ రూ. 80, నాన్వెజ్ బిర్యానీ రూ. 120గా పేర్కొంటూ ఎన్నికల కమిషన్ ధరలను ప్రతిపాదించింది. ఇదే సమయంలో వాహనాలకు రోజూ అద్దె విషయానికి వస్తే, 30 సీట్ల బస్సుకు రూ. 3,600, టాటా ఇండికా ఏసీ రూ. 1,440, క్వాలిస్కు రూ. 2,160 అద్దెను ఖరారు చేస్తూ, డ్రైవర్ బత్తా రోజుకు రూ. 240 ఇవ్వాలంటూ పేర్కొంది.ఆహార పదార్థాల వరకూ ప్రతిపాదించిన రేట్లు బాగానే ఉన్నాయని, వాహనాలు, హోర్డింగ్లు, లౌడ్ స్పీకర్ల ధరలను తగ్గించాలని హైదరాబాద్ ఎన్నికల అధికారి ఎం దానకిశోర్ తెలిపారు.
రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యంగా ప్రచార సామాగ్రి ధరలను తగ్గించాలని, లౌడ్ స్పీకర్లు, పోడియంల ధరలను ఎక్కువగా ఉన్నాయని టీడీపీ నేత వనం రమేశ్, బీజేపీ ప్రతినిధి పొన్న వెంకటరమణలు కోరారు. దీనిపై మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని దానకిశోర్ హామీ ఇచ్చారు.