హైదరాబాద్, అక్టోబర్ 28: ఆదివారం దౌల్తాబాద్ మండలం గోకఫస్లాబాద్ గ్రామంలో ఎన్నికల సందర్భంగా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేతలు అడ్డుకున్నారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేత రెడ్డి శ్రీనివాస్ తదితరులు కూడా టీఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అటు టీఆర్ఎస్ కార్యకర్తలు, ఇటు కాంగ్రెస్, వోయూ జేఏసీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాగా... తీవ్ర ఆగ్రహానికి లోనైన టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేత రెడ్డి శ్రీనివాస్పై దాడికి పాల్పడ్డారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ప్రచారాన్ని అడ్డుకున్న వారిని చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది.