హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి సెన్సేషన్ రైజ్ డ్యాన్స్ కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే క్రమంలో మాదకద్రవ్యాల సరఫరా, మద్యం, అమ్మాయిలతో యథేచ్ఛగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన వెల్లడించారు. భారీగా డబ్బులు వసూలు చేసి ఆ కార్యక్రమానికి మైనర్లను కూడా అనుమతిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అమ్మాయిలు, అబ్బాయిలను రూ. 3 వేలకే అప్పచెబుతామంటూ ఈవెంట్స్ నౌ సంస్థ డేటింగ్ ఏర్పాటు చేస్తోందని, ఈ కార్యక్రమం నిర్వహణపై ఎన్నికల అధికారి రజత్కుమార్ జోక్యం చేసుకుని నిలువరించకుంటే తామే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని రేవంత్ హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా టాస్క్ ఫోర్స్, సిట్ నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు. బెంగుళూరు, పుణేల్లో సెన్సేషన్ రైజ్ ఈవెంట్స్ను నిషేధిస్తే గచ్చిబౌలి స్టేడియంలో ఆ సంస్థ ఈవెంట్ నిర్వహణకు ఎలా అనుమతిచ్చారని నిలదీశారు.