గల్లంతు అయిన 25 లక్షలు ఓట్లు ...!

SMTV Desk 2018-10-15 15:37:42  telangana ,marri sasidhar reddy .

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలా ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతోందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. కొత్త ఓటర్‌ జాబితాలో 25 లక్షల ఓట్లు గల్లంతయ్యాయనీ, ఈ విషయాన్ని తాము నిరూపిస్తామని చాలెంజ్‌ చేశారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మరో సీనియర్‌ నేత నిరంజన్‌తో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. తాము ఎన్నికల సంఘానికి వ్యతిరేకం కాదని, కేవలం ఎన్నికల సంఘం సరిగా పని చేయకపోవడాన్నే తప్పుపడుతున్నామన్నారు. ఓటరు నమోదులో లోపాలను సరి చేసుకోకుండా, పంతానికి పోయి ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించిందన్నారు. తెలంగాణలో ఓటరు నమోదు కార్యక్రమం ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జరుగుతోందన్నారు. ఈవిఎంల పని తీరుపైనా అనేక అనుమానాలున్నాయని, ఈ సమయంలో ఎవరికీ తెలియకుండా ఈవిఎంల గోడౌన్‌ను ఎలా తెరుస్తారని ప్రశ్నించారు. నోడల్‌ ఆఫీసర్‌ సమక్షంలో ఈవిఎంల సీలు తీసి, తిరిగి మళ్లీ సీలు వేయాలని, ఇదంతా వీడియో తీయాల్సి ఉంటుందని చెప్పారు.