పరకాలలో గెలుపు నాదే

SMTV Desk 2018-09-30 09:53:20  Parakala, Konda Surekha, Congress

టీఆర్ఎస్ టికెట్లు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొండా సురేఖ దంపతులు ఎన్నికలపై దృష్టిపెట్టారు. తమ కుటుంబం నుంచి తానొక్కదాన్నే పోటీ చేస్తానని సురేఖ చెప్పారు. పరకాల నుంచి బరిలోకి దిగుతానని, తన భర్త మురళి ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటారని ఆమె తెలిపారు. ‘నిజానికి నేను, మా కూతరు సుస్మిత పోటీ చేయాలని అనుకున్నాం. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో నేను ఒక్కదాన్నే పోటీ చేస్తున్నాను. పోటీకి సుస్మిత కూడా సుముఖంగా లేదు. పరకాలలో గెలుపు నాదే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం మా కుటుంబ శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమం, భూపాల్‌పల్లి, వర్ధన్నపేట, నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం.. వీటితోపాటు పాలకుర్తి నియోజకవర్గంలో కూడా మురళి ప్రచారం చేస్తారు’ అని సురేఖ చెప్పారు. వరంగల్ తూర్పు తాజా మాజీ ఎమ్మెల్యే అయిన సురేఖ తన కుటుంబానికి మూడు టికెట్లు కోరిన్లు వార్తలు రావడం, అందుకు టీఆర్ఎస్ నిరాకరించడంతో పార్టీ మారడం తెలిసిందే. అయితే తాను ఒక్క టికెట్టే కోరానని సురేఖ చెబుతున్నారు. కాంగ్రెస్‌లోనూ ఆమె రెండు టికెట్లు కోరారని, అయితే టీడీపీ, టీజేఎస్ తదితర పార్టీలతో పొత్తు వల్ల ఒకటి మాత్రమే కేటాయిస్తామని అధిష్టానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.