హైదరాబాద్, జూలై 19 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో మూడు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్లో నిమిషం కూడా వృధా కాకుండా వర్షం కురుస్తుంది. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలకు నీరు చేరడంతో ఆ ప్రాంతాలన్నీ వర్షపు నీటితో జలమయమయ్యాయి. ఈ వర్షపు నీరు ఇండ్ల లోకి చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్ల పైకి భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 24x7 కంట్రోల్రూంను ఏర్పాటుచేసి సహాయక చర్యలు చెప్పట్టారు. మంగళవారం హుస్సేన్ సాగర్తోపాటు వెస్ట్ జోన్ పరిధిలోని కైతలకుంట, మదీనగూడ, నాచారం, విప్రో లేక్, మియాపూర్లోని పటేల్ చెరువు తదితర పది చెరువులు పూర్తిగా నిండినట్టు అధికారులు తెలిపారు. శివాజీ బ్రిడ్జి, కాచిగూడ క్రాస్ రోడ్, మాసబ్ట్యాంక్ కట్టమైసమ్మ టెంపుల్, నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూం, నాంపల్లి టీ జంక్షన్ ట్యాక్సీ స్టాండ్, బల్కంపేట్ టెంపుల్, టోలీచౌకీ సూర్యానగర్కాలనీ, తాజ్ ఐలాండ్ జంక్షన్, పోలీస్ కంట్రోల్ రూం, గోల్కొండ సాదత్నగర్, మాదాపూర్ హైటెక్ బావర్చీ, కూకట్పల్లి ఎల్లమ్మ బండ, ఖాజా గూడ మెయిన్ రోడ్, బహదూర్ పుర ఫిజా హోటల్, ఎర్రగడ్డ-బోరబండ మార్గం తదితర చోట్ల రోడ్లపై భారీగా నీరు నిలవడంతోపాటు ఇండ్ల లోకి వర్షపు నీరు చేరింది. ఈ వర్షాల కారణంగా రోడ్ల పరిస్థితి కూడా దారుణంగా తయారయ్యాయని అధికారులు అంటున్నారు