నేను రాసిన బహిరంగలేఖతో ఉద్యమానికి బీజం: కేసీఆర్

SMTV Desk 2018-09-03 12:05:35  KCR, Pragathi Nivedana,

ప్రపంచ వ్యాప్తంగా ఇది జనమా ప్రభంజనమా అనుకునే విధంగా తెలంగాణ గిరిజనగూడేలు, లంబాడా తండాలు, మారుమూల పల్లెలు, ప్రాంతాల నుంచి నలువైపుల నుంచి తరలివచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. సభను చూస్తుంటే గత జ్ఞాపకాలు కళ్ల ముందు కదులుతున్నాయని కేసీఆర్ అన్నారు. 2000 సంవత్సరంలో అప్పటి సీఎం ఎడా పెడా విద్యుత్ ఛార్జీలు పెంచితే రైతులు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారని అన్నారు. కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ నాటి సీఎంకు నేను రాసిన బహిరంగలేఖతో ఉద్యమానికి బీజం పడిందని కేసీఆర్ అన్నారు. 9, 10 నెలల పాటు విపరీత మేథోమథనం జరిగిందని.. ఏం చేయగలం.. ఏమి చేయలేం, మన అసహాయ స్థితి ఇంతేనా.. గుడ్లలో నీళ్లు గుడ్లలోనే కుక్కుకోవాల్సిందేనా.. ఏదైనా మార్గముందా.. లేదా అని ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదు, కొన్ని వేల మందిని సంప్రదించాను. సమైక్య రాష్ట్రంలో కష్టాలు తీరవని తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభించానని కేసీఆర్ అన్నారు.