హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో శివ, భార్గవ్, ప్రవీణ్ ల పరిస్థితి...

SMTV Desk 2018-08-30 19:07:21  harikrishna,accident,nalgonda,haiderabad

నల్గొండ జిల్లాలో టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అన్నేపర్తి వద్ద హరికృష్ణ కారు డివైడర్ ను తాకుతూ ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఫొటోగ్రాఫర్లు శివ, భార్గవ్, ప్రవీణ్ లు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణతో పాటు ఈ ముగ్గురిని కూడా నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి వైద్యసదుపాయం కల్పించారు. హరికృష్ణ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు తరలించిన తర్వాత ఆసుపత్రిలో ఉన్న తమను పట్టించుకునే వారే కరువయ్యారని వారు వాపోతున్నారు. ఈ ముగ్గురు ఫొటోగ్రాఫర్లు హైదరాబాద్ కు చెందిన వారే. ఈ ప్రమాదంలో తాము ప్రయాణిస్తున్న కారు, కెమెరాలు, ఇతర సామాగ్రి ధ్వంసమయ్యాయని, అప్పు చేసి కెమెరాలు కొనుగోలు చేశామని, ఆ వృత్తే తమ జీవనాధారమని బాధితులు చెప్పారు. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాళ్లమని, గాయాల నుంచి కోలుకుని తిరిగి పనిలో చేరే వరకు తమను ఎవరు పోషిస్తారని, తమను ఆసుపత్రిలో చేర్చిన అనంతరం పోలీసులు తమను పట్టించుకోవడం లేదని ప్రవీణ్, శివ చెప్పారు. తమ కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి వారు విఙ్ఞప్తి చేస్తున్నారు.