హైదరాబాద్, జూలై 17 : రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆదివారం మాక్ పోలింగ్ నిర్వహించి రాష్ట్రపతి ఎన్నికలపై టీఆర్ ఎస్ అప్రమత్తంగా వినియోగించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. మంత్రి హరీశ్ రావు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఈ మాక్ పోలింగ్ అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఓటింగ్ లో అనుసరించాల్సిన వ్యూహం, పద్ధతులను వివరించారు. సీఎం చెప్పిన క్రమంలోనే ఎమ్మెల్యేలంతా బస్సుల్లో అసెంబ్లీకి వెళ్లి ఓటింగ్ లో పాల్గొనాలన్నారు. అయితే ఈ మాక్ పోలింగ్ కు లక్ష్మారెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. మాక్ పోలింగ్ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ ఓటు వేయడంలో తడబడ్డారు. నంబర్ వన్ వేయడానికి పైన కొమ్మును, కింద అడ్డగీత వేశారు. దీని గమనించిన హరీశ్రావు నిలువుగా నంబర్ వేస్తే సరిపోతుందని, కొమ్ములు వద్దని సూచించారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ప్రభుత్వ పథకాలను, విద్యార్థులకు జరిగిన మేలును క్షేత్రస్థాయిలోకి తీసుకుపోయేలా విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు. విద్యార్థి విభాగం బలపడితే స్థానికంగా ఎమ్మెల్యేలకే రాజకీయంగా ఉపయోగపడుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. విద్యార్థి విభాగానికి సభ్యత్వం నేటి నుంచే ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించి, పర్యవేక్షించనున్నారు.