హైదరాబాద్, ఏప్రిల్ 29: సివిల్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అభినందనలు తెలిపారు. రాష్ట్ర విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దేశానికి సేవలందించడానికి సిద్ధమవుతున్న వారిలో తెలంగాణ బిడ్డలు పెద్ద సంఖ్యలో ఉండటం గర్వకారణమని కొనియాడారు. ఆలిండియా నంబర్ వన్ ర్యాంకు సాధించిన మెట్పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, 6వ ర్యాంకు సాధించిన ఖమ్మం జిల్లాకు చెందిన కోయ శ్రీహర్ష, 144వ ర్యాంకు సాధించిన మహబూబ్నగర్ జిల్లా పెంట్లవెల్లికి చెందిన గడ్డం మాధురి, 393వ ర్యాంకు సాధించిన కామారెడ్డికి చెందిన సురభి ఆదర్శ్, 624వ ర్యాంకు సాధించిన ఎడవెల్లి అక్షయ్ కుమార్, 721వ ర్యాంకు సాధించిన పెద్దపల్లికి చెందిన బల్ల అలేఖ్య, 724వ ర్యాంకు సాధించిన నిజామాబాద్ జిల్లా సాలూర గ్రామానికి చెందిన ఇల్తెపు శేషులను సీఎం అభినందించారు.