హైదరాబాద్, ఏప్రిల్ 27:తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 17వ ప్లీనరీ హైదరాబాద్లోని కొంపల్లిలో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించి.. తెలంగాణ తల్లికి పూలమాల వేశారు. పార్టీకి పార్టీకి ఇది 17వ ప్లీనరీ కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నాలుగోది. ప్లీనరీ వేదికకు ‘తెలంగాణ ప్రగతి వేదిక’గా నామకరణం చేశారు. ఈ ప్లీనరీలో రాష్ట్ర, జాతీయ రాజకీయ ముఖచిత్రాన్ని ఆవిష్కరించడంతో పాటు పార్టీ శ్రేణులకు అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ప్లీనరికి రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణులు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఆటపాటలతో కళాకారులు అలరిస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి వందమంది చొప్పున సదస్సుకు 13 వేల మంది ప్రతినిధులు హాజరవుతారు. 23 దేశాల నుంచి 200 మందికి పైగా తెలంగాణ ప్రవాస శాఖల ప్రతినిధులు తరలిరానున్నారు. విద్యార్థి విభాగం నుంచి 15 వందల మంది వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. కార్యకర్తల కోసం రుచికరమైన మాంసాహార, శాకాహార వంటకాలను సిద్ధం చేస్తున్నారు.