హైదరాబాద్, ఏప్రిల్ 14 : 65వ జాతీయ చలనచిత్ర అవార్డులో దగ్గుబాటి రానా నటించిన "ఘాజీ" చిత్రం జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. 1971లో భారత్-పాకిస్థాన్ మధ్య సముద్రగర్భంలో జరిగిన యుద్ధం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రానాతో పాటు తాప్సీ, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే "ఘాజీ"కి జాతీయ స్థాయి గుర్తింపు రావడంపై నటి తాప్సి ఆనందం వ్యక్తం చేశారు. "ఘాజీ సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నాను. ఇప్పటి వరకు నేను నటించిన మూడు చిత్రాలకు(ఆడుకాలం, పింక్, ఘాజీ) జాతీయ అవార్డులు రావడం సంతోషం కలిగిస్తుంది. ఈ చిత్రానికి పనిచేసిన వారందరికీ శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని వస్తాయని ఆశిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.