చెన్నై, ఏప్రిల్ 5 : సూపర్ స్టార్ రజనీకాంత్.. శంకర్ దర్శకత్వం వహిస్తున్న "2.ఓ" చిత్రంలో నటిస్తున్నారు. అయితే రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన "ఎందిరన్" చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తొలుత చిత్రయూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత ఇది సీక్వెల్ కాదని స్పష్టం చేసింది. లైకా సంస్థ నిర్మిస్తున్న "2.ఓ" చిత్రంలో రజనీ సరసన అమీజాక్సన్ కథానాయికగా నటిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం దర్శకనిర్మాతలు ఐశ్వర్యారాయ్ ని సంప్రదించారట. దీంతో ఈ చిత్రంలో ఐష్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇది "ఎందిరన్" చిత్రానికి సీక్వెల్ కానప్పుడు ఐష్ ఏ పాత్ర పోషిస్తున్నారో.. ఏది ఏమైనా చిత్రయూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.