ఇస్లామాబాద్, డిసెంబర్ 25: గూఢచర్యం ఆరోపణల కింద పాకిస్థాన్లో అరెస్టు అయిన భారత మాజీ నేవీ అధికారి కుల్భూషణ్ జాదవ్ను, ఆయన తల్లి, భార్య కలుసుకున్నారు. దాదాపు 21నెలల తర్వాత కలిసిన వారు 30 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ ఉదయం ఇస్లామాబాద్ చేరుకున్న జాదవ్ కుటుంబసభ్యులు పాక్ విదేశీ వ్యవహారాల కార్యాలయంలో ఆయనను కలుసుకున్నారు. వారి వెంట భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పాక్ విదేశాంగ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. జాదవ్ ఇరాన్ గుండా తమ బలూచిస్థాన్లోకి అక్రమంగా అడుగుపెట్టాడని గూఢచర్యం కేసు కింద పాకిస్తాన్ లోని ఓ సైనిక కోర్టు ఈ ఏడాది ఏప్రిల్లో జాదవ్కు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే.