హైదరాబాద్, డిసెంబర్ 23 : న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే ‘ఎం.సి.ఎ.’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుని జోరుమీద ఉన్నారు. ప్రస్తుతం నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చిత్రీకరణలో బీజీ బీజీగా ఉన్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ కథానాయికలుగా నటిస్తున్నారు. మరోవైపు వాల్పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతవర్మ దర్శకత్వం వహిస్తున్న ‘అ!’ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నాని ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఈ మూవీలో కనిపించే ఓ చేపకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. తాజాగా ‘అ!’ చిత్రంలో కనిపించనున్న చేప ఫొటోను అభిమానులతో నాని షేర్ చేసుకున్నారు. ‘పరోపకారం చేసే చేపగా ‘అ!’లో న్యాచురల్స్టార్ నాని’ అనే పోస్టర్ను పంచుకుంటూ.. ‘నా తర్వాతి చిత్రంలో ఓ ఆసక్తికర పాత్రను పోషిస్తున్నా. స్క్రిప్ట్ డిమాండ్ చేయటంతో ఈదడం నేర్చుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. కాగా, ఈ చిత్రంలో నిత్యామీనన్, కాజల్, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చేపతో పాటు మరో ప్రాణి కూడా ఇందులో కనిపించనుంది. దానికి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.