హైదరాబాద్, డిసెంబర్ 22 : మిడిల్ క్లాస్ అబ్బాయి లాంటి హీరో పాత్రలో న్యాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం ‘ఎం.సి.ఎ’. ఈ చిత్రం విడుదలైన రోజునే భారీ వసూలు చేసింది. డిసెంబర్ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మించారు. గతంలో నాని నటించిన ‘నిన్నుకోరి’ ఓపెనింగ్స్ కంటే ‘ఎం.సి.ఎ’ అత్యధికంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.15 కోట్లు రాబట్టింది. నిన్నుకోరి చిత్రంతో పోలిస్తే రెండింతలు ఎక్కువగానే వసూలు చేసిందట. అయితే, ఈ చిత్రంలో భూమిక, రాజీక్ కనకాల, నరేశ్, ఆమని, ప్రియదర్శిని పులికొండ ప్రధాన పాత్రలు పోషించగా, సాయిపల్లవి కథానాయికగా మరోసారి అందరినీ ఆకట్టుకుంది. కాగా, ప్రస్తుతం నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తైన తరువాత నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించబోతున్నట్లు సినీ వర్గ సమాచారం.