బెంగుళూరు, డిసెంబర్ 05 : ప్రముఖ కన్నడ దిగ్గజ నటుడు, గోల్డెన్ స్టార్ గణేశ్ నటించిన ‘చమక్’చిత్ర ఆడియో విడుదల వేడుకకి టాలీవుడ్ హీరో విజయ్ దేవర కొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణేష్ కు జోడిగా రష్మిక మందన నటిస్తుండగా, కన్నడ దర్శకుడు సుని ‘చమక్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ " కర్ణాటక చాలా మంది ప్రముఖ నటులను, క్రికెటర్లును పరిచయం చేసింది. ఈ రాష్ట్రం రాహుల్ ద్రవిడ్, జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్ లాంటి ఎంతో మంది క్రీడాకారులను అందించింది. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్, తో పాటు తెలుగు సినీ పరిశ్రమలో అనుష్క శెట్టి కూడా ఇదే రాష్ట్రానికి చెందిన వారే. ఇప్పుడు రష్మిక మందన మా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ‘హీరోగా నా తొలి చిత్రం (పెళ్లిచూపులు) వంద రోజులు ఆడింది. ఆ గర్వంతో ఓసారి గోల్డెన్ స్టార్ గణేశ్ గురించి గూగుల్లో వెతుకుతున్నాను. ఆయన నటించిన చిత్రం 800 రోజులు ఆడిందని తెలిసి ఆశ్చర్యానికి లోనయ్యాను" అని గణేశ్ స్టార్ డం ను గుర్తుచేశారు.