కైరో, నవంబర్ 25: ఉగ్ర ఉన్మాదం మళ్లీ దండెత్తింది. ఈజిప్టులో అల్ అరిష్ నగరంలోని అల్ రౌదా మసీదులో సాయుధ దుండుగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 235 మందికి పైగా మృతి చెందగా మరో 109మంది గాయపడ్డారు. నాలుగు వాహనాల్లో వచ్చిన సాయుధులు అత్యంత శక్తివంతమైన బాంబులను మసీదుపైన విసిరారు. ప్రాణాలను కాపాడుకోవాలని పరుగులు తీస్తున్న నిరాయుధులైన ప్రజలపై కాల్పులు జరిపారు. మసీదు చుట్టూ చెల్లాచెదురుగా పదుల సంఖ్యలో మృతదేహాలు పడిపోయాయి. ఈ ఘటనతో ఈజిప్టు ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ దాడిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.