బాగ్దాద్, నవంబర్ 13 : ప్రకృతి విపత్తుకు 140 మంది మృత్యువాత పడగా, మరో 860 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డ ఘటన ఇరాన్-ఇరాక్ సరిహద్దుల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇరాన్-ఇరాక్ లో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఇరాక్ హలబ్జా నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా.. సుమారు 14 ప్రావిన్స్ల్లో భారీ నష్టం సంభవించింది. భూ ప్రకంపనలతో ప్రజలు భయబ్రాంతులకు గురై, ఓ పక్క చల్లటి గాలులు వీస్తుండగా బిక్కు బిక్కుమంటూ రాత్రంతా రోడ్లపైనే గడపాల్సి వచ్చింది. దీని ప్రభావంతో నగరంలో విద్యుత్ ను నిలిపివేశారు. పట్టణంలోని ప్రధాన ఆస్పత్రి కూడా కుప్ప కూలిపోవడంతో గాయపడ్డ క్షతగాత్రులను సమయానికి ఆసుపత్రికి తరలించకపోవడంతో వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.