హైదరాబాద్ అక్టోబర్ 7: తాజాగా వచ్చిన ‘యుద్ధం శరణం’ సినిమాలో మళ్లీ విలన్ పాత్రలో కనిపించి, అందర్నీ ఆశ్చర్య పరిచారు హీరో శ్రీకాంత్. ఇప్పుడు మరో సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. అభయ్ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ, జై రాజాసింగ్ దర్శకత్వంలో ఏవీఎల్ ప్రొడక్షన్స్ సంస్థ కొత్త చిత్రం రూపొందించనుంది. మెడికల్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సినిమా గురించి మాట్లాడుతూ... ‘‘కథ వినగానే నచ్చి, వెంటనే ఒప్పుకున్నా. ఇలాంటి మంచి కథలో కీ రోల్ చేస్తుండటం సంతోషంగా ఉంది. జై రాజాసింగ్ కొత్త దర్శకుడైనా భిన్నమైన కథను ప్రతిభావంతంగా రాసుకున్నారు’’ అన్నారు. ‘‘ఎప్పుడూ మంచి పాత్రలు, వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయాలని శ్రీకాంత్గారు ఆరాటపడుతుంటారు. ఆయనలో గొప్ప నటుడున్నారు. కథ రాసుకుంటున్నప్పుడే ఈ పాత్ర ఆయనే చేయాలని అనుకున్నా. ఇప్పటివరకూ చూడని కొత్త తరహాలో ఆయన పాత్ర ఉంటుంది’’ అన్నారు జై రాజా సింగ్. హీరో శ్రీకాంత్ కెరీర్ ప్రారంభం లో విలన్గా ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత హీరోగా మారి మొత్తంగా వంద సినిమాలు పూర్తి చేశారు. ఇపుడు జగపతి బాబు లా సినిమా లో విలన్ పాత్రలను పోషించడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రం తోనైనా విలన్ పాత్రకు సరైన గుర్తింపు వస్తుందేమో చూడాలి మరి.