న్యూఢిల్లీ, సెప్టెంబర్, 1 : ఇటీవల డొక్లాం సరిహద్దు పై భారత్-చైనాల మధ్య వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే, అయితే డొక్లాం సరిహద్దులోని ప్రతి అంగుళంలో సైనిక, రక్షణ బలగాలను మోహరిస్తామని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆ ప్రాంతంలో నిర్మాణాత్మక పనులు చేపట్టడానికి వెనుకాడబోమని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెల్లడించింది. చైనా దేశ సర్వాధికారాన్ని కాపాడటానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా జాతీయ రక్షణ శాఖాధికారి కల్నల్ రెన్ గువాకియాంగ్ పేర్కొన్నారు. ఈ వివాదం ప్రారంభం అవ్వడంతో డోక్లాం ప్రాంతం మీద చైనా మిలటరీ ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది. ఈ వివాదానికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు మిలటరీ తన పని తాను చేసుకుపోతుందని రెన్ తెలిపారు. ఈ మేరకు చైనా బలగాలు వెనక్కి తగ్గుతున్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ, డోంగ్ లాంగ్ ప్రాంతంలోని ఒక్క అంగుళాన్ని కూడా చైనా కోల్పోవడం జరగదని, దీనికి సంబంధించి చైనా మిలటరీ శాయశక్తుల ప్రయత్నిస్తుందని రెన్ అన్నారు.