కొలంబో: శ్రీలంకలో జరిగిన జరిగిన వరుస బాంబు పేలుళ్ళ కారణంగా ఆ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్కు చెందిన పీస్ టివిని శ్రీలంకలో నిషేధిస్తూ మరో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కేబుల్ ఆపరేటర్లు ఈ ఛానెల్ ప్రసారాలను నిలిపివేసినట్టు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే వరుస పేలుళ్ల ఘటన నేపథ్యంలో ఐసిస్కు సంబంధించిన భావజాల కార్యక్రమాలను పీస్ టీవీలో ప్రసారం చేసి, యువతను ఆకర్షిస్తున్నారనే ఆరోపణలపై దీన్ని నిషేధించారు. కాగా ఇప్పటికే భారత్, బంగ్లాదేశ్లు ఈ ఛానెల్పై నిషేధం విధించాయి. జకీర్ నాయక్, ముంబయికి చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా 2006లో పీస్ టీవీని స్థాపించారు. దీనికి ఉర్దూ వెర్షన్ను 2009లో, బంగ్లా వెర్షన్ను 2011లో మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ ఛానెళ్లన్నీ దుబాయ్ కేంద్రంగా ప్రసారం అవుతున్నాయి.