హైదరాబాద్, ఆగస్ట్ 19: ప్రముఖ నటి ప్రియమణి ఈ నెల 23న తన ప్రియుడు ముస్తఫా రాజ్ను పెళ్లి చేసుకోబోతున్న విషయం సుపరిచితమే. కాగా, ఈ నేపధ్యంలో చిత్ర పరిశ్రమలో చాలా గుసగుసలు వినిపించాయి. పెళ్లి తర్వాత ప్రియమణి నటనకు దూరంగా ఉంటారని, ఆడంబరాలు ఏమి లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారని లాంటి పుకార్లు పుట్టాయి. అయితే వీటి అన్నిటి పై ప్రియమణి స్పందిస్తూ... రిజిస్టర్ మ్యారేజ్కి గల కారణం తెలిపారు. మేము వెర్వేరు మతాలకు చెందిన వాళ్లం. అందుకే సంప్రదాయబద్ధంగా కాకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నాం. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది సరైన పనే. పెళ్లి జరిగిన రెండు రోజుల తర్వాత నుంచే షూటింగ్కు వెళ్తా. నేను విరామం తీసుకోను.. ఎందుకంటే వరుసగా రెండు సినిమాలు ఉన్నాయి అని ఆమె తెలిపారు. ప్రియమణి, మస్తఫా రాజ్తో కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారు. అయితే వీరి నిశ్చితార్థం 2016 మే జరిగింది. బెంగుళూరులో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. వేరే మతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నందుకు అప్పట్లో ప్రియమణిపై నెటిజన్లు విమర్శలు గుప్పించగా... నా జీవితం, నా ఇష్టం అంటూ ప్రియమణి ఘాటుగా సమాధానమిచ్చారు.