కొలంబో: వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దేశం ఒక్కసారిగా అల్లకల్లోలం అయ్యింది. ఈ పేలుళ్ళలో దాదాపు 185 మంది చనిపోగా 550 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే ఈ దాడుల కారణంగా జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని శ్రీలంక విమానయానశాఖ ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దేశీయ విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేసినట్లు వారు తెలిపారు. బండారునాయకే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అదనపు భద్రతను కల్పించారు. సాధారణ సమయానికంటే నాలుగు గంటలు ముందుగానే ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈస్టర్ సండే వేడుకలను పురస్కరించుకుని మూడు చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్న వారిపై, మూడు హోట్లతో పాటు మరో రెండు చోట్ల సూసైడ్ బాంబర్లు దాడి చేశారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 185 మంది చనిపోయారు. 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో వంద మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇస్లామిక్ ఉగ్రవాదులే ఈ పేలుళ్లకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. దీంతో శ్రీలంకలో హైఅలర్ట్ ప్రకటించారు.