ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్స్మిత్ భారత దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో హరిద్వార్లో ప్రత్యేక పూజలు చేశాడు. ఈ సందర్భంగా అతడు స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘నాలో ఎక్కడలేని చైతన్యాన్ని నింపింది భారత పర్యటన. నా జీవితంలో ఈ పర్యటన ఓ అద్వితీయమైన అనుభూతిగా మిగిలిపోతుంది. విభిన్నవర్గాలు, ఇక్కడి ప్రకృతి అందాలు, మనుషులు, మనస్తత్వాలు, సంప్రదాయాలు, ఆచారాలు నన్నెంతో ఆకర్షించాయి. నన్ను నేను తెలుసుకోవడానికి ఈ పర్యటన ఎంతో ఉపయుక్తమైంది’ అని ఇన్స్టాగ్రామ్లో ఫోటోలను జతచేస్తూ షేర్ చేశాడు. కొద్ది సేపట్లోనే వీటికి 15 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. హిందువులు దేవతలా భావించే గంగా నదికి, పరమ శివుడికి ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తారు. నిత్యం భక్తులు వేల సంఖ్యలో హరిద్వార్ని సందర్శిస్తుంటారు. దేశ విదేశాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు.