బీజింగ్, మార్చ్ 31: టెక్నాలజి రంగంలో ఎప్పుడూ ముందంజలో ఉండే చైనా...ఈ రంగంలో మరో రికార్డు సాధించింది. చైనాలోని షాంఘై 5జీ సేవలు వినియోగిస్తున్న తొలి జిల్లాగా రికార్డు సృష్టించింది. జపాన్, జర్మనీ, అమెరికా లాంటి దేశాల్లో 5జీ సేవలు ఇంకా అమలు దశలోనే ఉన్నాయి. కాగా చైనా వీటిని అధిగమించి వినియోగంలోకి తీసుకువచ్చింది. చైనా ప్రభుత్వ అధికారిక పత్రిక చైనా డైలీ తెలిపిన ప్రకారం.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టెలికాం సంస్థ చైనా మొబైల్ 5జీ నెట్ వర్క్ ట్రయల్ రన్ ను అధికారికంగా షాంఘై జిల్లాలో ప్రారంభించిందని పేర్కొంది. గత మూడు నెలల కాలంలో షాంఘైలోని వివిధ చోట్ల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు.. దీంతో జిల్లా మొత్తం 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చినట్లైందని ఆ కథనంలో తెలిపింది.