ఘనాలో ఘోర రోడ్డు ప్రమాదం..

SMTV Desk 2019-03-23 12:04:32  ghana,

ఘనాలోని కిన్టాంపోలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు రెండు బస్సులు ఒకదానొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో కలిపి దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతోనే భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు అక్కడి అధికారులు చెప్పారు. ప్రమాద స్థలికి చేరుకున్న సహాయక బృందాలతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా చేరకుని క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 28 మంది ప్రయాణికులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.