దాయాది పాకిస్తాన్ మరోసారి దాని వక్రబుద్దిని చాటుకుంది. ఇండియాను నేరుగా ఎదురుకోలేక నకిలీ కరెన్సీని ముద్రించి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయాలనీ ప్రయత్నాలు చేసింది. కానీ ఇండియన్ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ గుట్టు రట్టు చేసింది. ఇండియను దెబ్బ తీయాలనే లక్ష్యంతో పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ నకిలీ కరెన్సీని ముద్రిస్తూ, దాన్ని బంగ్లాదేశ్ మీదుగా ఇండియాలోకి పంపిస్తుంది. ఇండియాలో చలామణిలో ఉన్న అసలైన కరెన్సీలానే ఈ నకిలీ కరెన్సీ కూడా ఉంటోంది. కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ లేకున్నా, చూడగానే, అసలైన కరెన్సీ మాదిరే కనిపిస్తుండటంతో ఇవి ఇండియాలో చలామణి అవుతున్నాయి. దీన్ని పసిగట్టిన ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో బండ్లగూడకు చెందిన మహ్మద్ గౌస్ అనే పండ్ల వ్యాపారిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాకిస్తాన్లోని కెట్వాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రింటింగ్ ప్రెస్లో ఈ నకిలీ కరెన్సీని ముద్రిస్తున్నారు. తదనంతరం బంగ్లాదేశ్కు తరలించి, ఆపై కోల్కతా మీదుగా ఇండియాలోకి పంపుతున్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా కేంద్రంగా ఈ వ్యాపారం సాగుతోందని పోలీసులు గుర్తించారు. ఆ రాష్ట్రంలో బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న కృష్ణాపూర్కు చెందిన అమీనుల్ రెహ్మాన్ అలియాస్ బబ్లూతో పరిచయం పెంచుకున్న గౌస్, లక్ష నకిలీ కరెన్సీకి రూ.40 వేలు ఇస్తూ, డబ్బు తెప్పించి చలామణి చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. మోస్ట్ వాంటెడ్ జాబితాలో బబ్లూను చేర్చి అతని కోసం గాలింపు ప్రారంభించారు.