వెల్లింగ్టన్, మార్చ్ 15: శుక్రవారం ఉదయం న్యూజిలాండ్ లొనీ రెండు మసీదుల్లో దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాల్పుల్లో 40 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు చెపుతున్నారు. శుక్రవారం కావడంతో మసీదు వద్ద ప్రార్థనలు చేసే ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. మసీదుకు వచ్చిన వారిని టార్గెట్ గా చేసుకుని దుండగులు దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా అక్కడే ఉన్నారు. దుండగుడు కాల్పులు జరుపుతూ దాదాపు 17 నిమిషాల పాటు లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయడం గమనార్హం. దీంతో వెంటనే అప్రమత్తమైన బంగ్లాదేశ్ ఆటగాళ్లు అక్కడినుంచి పక్కనే ఉన్న పార్క్ ద్వారా తప్పించుకున్నారు. అల్ నూర్ మసీదులో 300 మంది కి పైగా ఉన్నారు. మసీదులో చాలా మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశాయి. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.