బంగ్లాదేశ్, ఫిబ్రవరి 26: బంగ్లాదేశ్ లో విమానం హైజాక్ డ్రామా నడిచింది. బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాన్ని ఓ వ్యక్తి హైజాక్ చేయడానికి ప్రయత్నించాడు. ఆదివారం 148 మంది ప్రయాణికులతో ఢాకా నుంచి దుబాయ్ బయలుదేరిన విమానంలో తుపాకీతో బెదిరించి ఓ వ్యక్తి కాక్పిట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. తుపాకి చూపిస్తూ తన వద్ద పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయని ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ఛత్రోగ్రామ్ విమానాశ్రయంలో దించారు. రంగంలోకి దిగిన భద్రతా దళాలు హైజాకర్తో మాట్లాడి ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు. అనంతరం హైజాకర్ను కాల్చి చంపారు.
ఆ వ్యక్తిని దళాలు కాల్చి చంపిన తర్వాత ప్రాథమిక విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ప్రయాణికులను బెదిరించేందుకు హైజాకర్ వాడింది బొమ్మ తుపాకీ అని తేలింది. భార్యతో వ్యక్తిగత గొడవల కారణంగానే విమానాన్ని హైజాక్ చేశాడని, అతడి మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని అధికారులు తెలిపారు. అయితే, సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని, ఇప్పుడే ఓ నిర్ధారణకు రాలేమని పేర్కొన్నారు. కాగా, హైజాకర్ ఉపయోగించింది బొమ్మ తుపాకియే అయినా అది విమానంలోకి ఎలా తీసుకురాగలిగాడనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి వద్ద ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు నిర్ధారించారు.