అమెరికా, ఆగష్టు 2: ఇటీవల తరచు అమెరికా ఉత్తర కొరియాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక సంచలనానికి నాంది పలికాడు. అమెరికా ఉత్తర కొరియాతో యుద్దం చేయనుందా అంటే అవుననే అనిపిస్తున్నాయి ఈ సంకేతాలు. హై అల్టిట్యూడ్ బాలిస్టిక్ ఎరియా క్షిపణులను ఉత్తర కొరియా మెరుగుపరచుకోవడానికి సమయం ఇవ్వకుండా, ఆ దేశాన్ని నాశనం చేస్తానని తనతో ట్రంప్ అన్నట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ ఎన్బీసీ మీడియాతో చెప్పారు. ఉత్తర కొరియా దేశం మొత్తాన్ని నాశనం చేయగల సామర్ధ్యం అమెరికన్ మిలటరీకి ఉందని అధ్యక్షుడు స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు. అమెరికాలోని ప్రతి ప్రాంతాన్ని తాము చేరుకోగలమని, అలాంటి క్షిపణులు మా దేశం కలిగి ఉందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ వెల్లడించిన సందర్భంగా, లిండ్సే గ్రాహమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాను చైనా కట్టడిచేయకపోతే, అమెరికాకు మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ మిలిటరీ ప్రోగ్రాం మాత్రమే అని ఆయన అన్నారు. ఉత్తర కొరియా ఖండాతర బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేయడానికి ప్రయత్నిస్తే, అమెరికా చూస్తూ ఊరుకోబోదని ఆయన హెచ్చరించారు.