హైదరాబాద్, జూలై 4 : హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే దేవుడు శ్రీ రాముడిపై సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మీద కేసు బుక్ కావటంతో పాటు.. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం జైలు నుండి బయటకు వచ్చిన కత్తి.. మరోసారి శ్రీరాముడిపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఈ మేరకు కత్తి మహేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని మెగా బ్రదర్ నాగబాబు డిమాండ్ చేశారు. ఏ మతాన్నైనా కించపరుస్తూ ఎవరు మాట్లాడిన తప్పేనని.. రామాయణం ఒక పుస్తకం కాదని, కోట్లాది మంది హిందువులు ఆరాధించే చరిత్ర అని వ్యాఖ్యానించారు. క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎలాగో హిందువులకు రామాయణం, మహాభారతం అలాంటివి అంటూ ఉద్ఘాటించారు. హిందువుల మనోభావాలను కించపరిచిన కత్తి మషేష్పై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ ఈ విషయాన్ని పోలీసులు తేలిగ్గా తీసుకుంటే.. ప్రజలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.