జూబ్లీహిల్స్, జూన్ 3 : ప్రముఖ సినీనటుడు, మంచు మనోజ్ ఓ పబ్లో అర్ధరాత్రి వీరంగం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో జనరల్ డైరీ(జీడీ)లో మాత్రమే నమోదు చేశారు. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 45లోని ఫ్యాట్ పీజియన్ పబ్కు గత నెల 22న మంచు మనోజ్ వెళ్లారు. రాత్రి 11.30 గంటలు కావడంతో పబ్ నిర్వాహకులు డీజే సౌండ్ తగ్గించారు. దీంతో కోపంతో మనోజ్ శబ్దం పెంచాలంటూ డీజేను, స్పీకర్లు ను ద్వంసం చేశారు. విషయం తెలిసి జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకోగా.. " తాను ఫేస్బుక్ లైవ్ ఆన్ చేయగా పబ్లో డీజే సౌండ్ ఎక్కువగా కావడంతో, తగ్గించాలని అడిగాను." అని మనోజ్ పోలీసులకు చెప్పారు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీసీ కెమెరా ఫుటేజీనంతా పబ్ నిర్వాహకులు పోలీసులకు అందించారు. ఫిర్యాదు చేయడానికి పబ్ నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో కేసు నమోదు చేయలేదని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు.