హైదరాబాద్, మే 11 : 71వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఫ్రాన్స్లో ఈ నెల 8 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు మే 19వరకు జరగనున్నాయి. తొలిరోజు పలువురు హాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఇక రెండవ రోజు దీపిక పదుకొణె.. పొడవాటి తెలుపు రంగు డ్రెస్ లో అందరి చూపును తనవైపునకు తిప్పుకున్నారు. ఈ సారి వేడుకకు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హాజరయ్యారు. తొలిసారి కంగనా కేన్స్ కు హాజరైనప్పటికీ తన లుక్తో అక్కడివారిని ఆకట్టుకున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జుహైర్ మురాద్ డిజైన్ చేసిన గౌనులో కంగనా అందంగా ముస్తాబయ్యారు. ఈ వేడుకలలో పాల్గొనేందుకు ఐశ్వర్య తన కూతురితో కలిసి ప్రాన్స్ కు బయలుదేరారు. కేన్స్ జ్యూరీ సభ్యురాలిగా, ప్రముఖ ఫ్రెంచ్ బ్రాండ్ లారియల్కు ఐష్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పెళ్లైన బాలీవుడ్ జంట సోనమ్ కపూర్ దంపతులు సైతం హాజరుకానున్నట్లు సమాచారం. సోనమ్ కూడా లారియల్కు ప్రచారకర్తగా ఉన్నారు. కాగా భారతీయ చిత్రాలకూ ఈ చిత్రోత్సవంలో స్థానం దక్కింది. ఈ ఏడాది పోటీపడనున్న 21 చిత్రాల్లో పలు భారతీయ చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. ఇంకా ఈ వేడుకకు బాలీవుడ్ నటులు హ్యూమా ఖురేషీ, మల్లికా శెరావత్, తమిళ నటుడు ధనుష్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.