ముంబై, ఏప్రిల్ 28 : బాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లి వార్తలు వస్తున్నాయి. సోనమ్-ఆనంద్ అహూజా, రణ్వీర్ సింగ్- దీపిక పదుకొణె జంటలు వివాహం చేసుకోబోతున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నటి శ్రద్ధా కపూర్ లెహెంగా ధరించి దిగిన ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘అతిపెద్ద వేడుక కోసం’ అని ఫొటోకు క్యాప్షన్ ఇవ్వడంతో శ్రద్ధ పెళ్లి చేసుకోబోతున్నారా? అని చర్చలు సాగుతున్నాయి. దీనిపై శ్రద్ధ తండ్రి, అలనాటి నటుడు శక్తి కపూర్ స్పందించారు. " పిల్లలకు తల్లిదండ్రులు పెళ్లి చేసే కాలంపోయింది. ఇప్పుడు వారికి వారే జీవిత భాగస్వాములను వెతుక్కుంటున్నారు. కాలానికి తగ్గట్టే మనమూ మారాలన్నది నా ఆలోచన. ప్రస్తుతం కెరీర్ పరంగా శ్రద్ధ చాలా బిజీగా ఉంది. పెళ్లి విషయం తనకే వదిలేస్తున్నాను. నచ్చినవాడినే పెళ్లి చేసుకుంటుంది. ఇందులో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు" అని శక్తి కపూర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శ్రద్ధ ‘సాహో’ చిత్రంలో ప్రభాస్కు జోడీగా నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో... బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవ్లిన్ శర్మ, చుంకీ పాండే, నీల్ నితిన్ ముఖేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు సైనా నెహ్వాల్ బయోపిక్, ‘బత్తీ గుల్ మీటర్ చాలూ’, ‘స్ట్రీ’ చిత్రాలలో కూడా నటిస్తున్నారు.