హైదరాబాద్, జూలై 5 : తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రూ. 10 కోట్లు మంజూరు చేసినట్లు హోంమంత్రి, బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత రెండు వారాల నుంచి ఆషాడం బోనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులైన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు దేవాదాయశాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ తదితరులు మంగళవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గత ఏడాది కన్నా ఈ సారి రేటింపు నిధులు విడుదల చేశారని, అదే స్థాయిలో ఈ నిధులకు సమంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నిధుల్లోంచి కొంత మొత్తాన్ని సాంస్కృతికశాఖకు విడుదల చేసి సాంస్కృతిక ప్రదర్శనలకు,దేవాలయాల్లో విద్యుత్ దీపాల అలంకరణకు ఖర్చు చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 23 అసెంబ్లీ నియోజక వర్గాల్లో దేవాలయాలకు నిధులను అందిచాలని అధికారులకు వెల్లడించారు. ఈ సంబంధిత అధికారులకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ నెల 7న ఉదయం 11 గంటలకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి కార్పోరేటర్లందరూ హాజరు కావాలని హోంమంత్రి సూచించారు.