స్వలాభం కోసం పరువు తీస్తే ఊరుకోం: రోజా

SMTV Desk 2018-04-22 10:48:29  YSRCP MLA RK Roja Comments On Casting couch And TTD Issues

తిరుమల, ఏప్రిల్ 22: స్వలాభం కోసం ఎవరైనా సరే ఇండస్ట్రీ పరువు తీయాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా హెచ్చరించారు. తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ భూతాన్ని తరిమేసే పోరాటంలో బాధితులకు అండగా ఉంటామని ఆమె అన్నారు. 1991 నుంచీ తాను చిత్రపరిశ్రమలో ఉన్నానని, ఇప్పటిదాకా కాస్టింగ్‌ కౌచ్‌పై ఎవరూ ఫిర్యాదు చేయలేదని గుర్తుచేశారు. ఇప్పుడు, ఇకపైనా ఎవరికైనా ఇబ్బందులు కలిగితే నేరుగా వచ్చి ఫిర్యాదు చెయ్యొచ్చన్నారు. అయితే, వ్యక్తిగత లాభం కోసం చిత్రపరిశ్రమలోని వారిపైనో, లేక పవన్‌ కల్యాణ్‌పైనో దూషణలకు దిగడం మంచిదికాదని హితవుపలికారు. ఆదివారం తిరుమల వచ్చిన ఎమ్మెల్యే రోజా కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. టీటీడీ పాలకమండలి నియామకాల విషయంలో సీఎం చంద్రబాబు హిందువుల మనోభావలను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సినీ పరిశ్రమ కూడా పోరాడుతుందని చెప్పారు. టీటీడీ పాలకమండలిలో నియామకాలు హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని అన్నారు.కనీసం ఇప్పటికైనా టీటీడీ పాలక మండలిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.