కోల్కతా, ఏప్రిల్ 22 : కింగ్స్ X1 పంజాబ్ జట్టు హ్యట్రిక్ విజయం సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుతో వారి సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో డక్వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) ప్రకారం పంజాబ్ జట్టుతొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. కింగ్స్ X1 జట్టు లో క్రిస్ గేల్ (62) , కేఎల్ రాహుల్ (60) చెలరేగి ఆడారు. టాస్ నెగ్గిన పంజాబ్ సారథి అశ్విన్ ప్రత్యర్ధి జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు. బ్యాటింగ్ కు దిగిన కేకే ఆర్ జట్టులో క్రిస్ లిన్ (74), దినేష్ కార్తీక్ (43), రాబిన్ ఉతప్ప (34) రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆ జట్టు 191 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు రెచ్చిపోయారు. 96/0తో పటిష్ట స్థితిలో ఉన్న దశలో వర్షం మ్యాచ్ను అడ్డుకుంది. వర్షం తగ్గాక పంజాబ్ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 125 పరుగులుగా నిర్ణయించారు. ఆ టార్గెట్ ను పంజాబ్ 11.1 ఓవర్లలో ఒక్క వికెట్టే కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు కేఎల్ రాహుల్ కు దక్కింది.