మహబూబ్నగర్, ఏప్రిల్ 20: ప్రజల్లో పాత్ర లేక కాంగ్రెస్ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు తెలంగాణలోని ఆ పార్టీ నాయకులంతా తలోబస్సు తీసుకుని యాత్రలు చేసినా వారిని ప్రజలు నమ్మే పరిస్థితి లేరని అధికారంలో ఉన్నప్పుడు ఏమి ఒరగబెట్టారని ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలంటూ మంత్రి పిలుపునిచ్చారు. శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో మహిళా సంఘం భవనం ప్రారంభానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా బాదేపల్లి మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో పాత్రలేకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్సుయాత్రకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు.