హైదరాబాద్, ఏప్రిల్ 18 : ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ సభ్యత్వాలను కొనసాగించాలని హైకోర్టు తీర్పునివ్వడం ముఖ్యమంత్రి కేసీఆర్కు శరాఘాతమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బస్సు యాత్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చేరుకోగా.. అక్కడి బహిరంగసభలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి, శాసనసభాపతి మోసపూరితంగా వ్యవహరించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు కేసీఆర్కు చెంప పెట్టులాంటిదన్నారు. సీఎం కేసీఆర్కు, అసెంబ్లీ స్పీకర్కు ఆ పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని దుయ్యబట్టారు.