హైదరాబాద్, ఏప్రిల్ 13: తెలంగాణలో ఇసుక పాలసీ అద్భుతంగా ఉందని పంజాబ్ కాంగ్రెస్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఖండించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన వైపే సిధ్దూ వినడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... సిద్ధూ మరోసారి ఇక్కడికి వస్తే తాము నిజాలు చూపిస్తామన్నారు. ఆయన ప్రభుత్వ పర్యటనలో ఉన్నారని, పార్టీకి సంబంధించినది కాకపోవడంతో అవగాహన లేదని వ్యాఖ్యానించారు. సిధ్దూ విషయాన్ని ఇప్పటికే హైకమాండ్ దృష్టి తీసుకెళ్లినట్టు శ్రవణ్ వెల్లడించారు.అంతే కాకుండా రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తోంది శ్రవణ్ పునరుద్ఘాటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో కొల్లాపూర్లో అక్రమంగా ఇసుక దందా కొనసాగుతోందని అరోపించారు.