హైదరాబాద్, ఏప్రిల్ 13: ధర్నా చేపట్టిన పలువురు టీ టీడీపీ నేతలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. డాక్టర్ అంబేద్కర్ 125 జయంతి సందర్భంగా లోయర్ ట్యాంక్బండ్ అంబేద్కర్ భవనంలో 15 అంతస్తుల టవర్, 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి విస్మరించడంతో టీడీపీ నగర పార్టీ ఆధ్వర్యంలో లోయర్ ట్యాంకుబండ్ అంబేద్కర్ భవన్ వద్ద టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, టీడీపీ నగర అధ్యక్షుడు ఎం. ఎన్ శ్రీనివాసరావు తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. విషయం తెల్సుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ధర్నా చేస్తున్న వారిని అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్స్టేషన్కు తరలించారు.