హైదరాబాద్, మే 28 : బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను, అబద్దాల కోరంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. మరో మారు తన సహజ పంథాలో విరుచుకుపడి అందర్ని విస్మయానికి గురిచేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన అధ్యక్షుడు కాబట్టి ఆయన విషయం ప్రస్తావించాల్సి వస్తుందని.. మరొకరైతే పట్టించుకోవాల్సిన పని ఉండేది కాదని చెప్పారు. అబద్ధాలతో తెలంగాణా ప్రజలను మాయ చేయాలని చూశారని... తెలంగాణా ప్రజలను తక్కువ చేసి వ్యవహరించినందుకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు దేశానికి ఆదాయం అందించే రాష్ట్రాల్లో తమ రాష్ట్రం ఉందని, ఐటీ ఎగుమతుల ద్వారా కేంద్ర ఆర్థిక ప్రయోజనాలు అత్యధిక స్థాయిలో తెలంగాణ ద్వారానే సమకూరుతుందని వివరించారు. మిషన్ కాకతీయ, భగీరథ పథకాలకు నిధులు కేటాయించాలని నీతిఆయోగ్ సూచించినా ఇప్పటివరకు పైసా మంజూరు చేయలేదని ప్రకటించారు. కేంద్రం బాధ్యతగా నిధులు మంజూరు చేయాల్సి ఉంటుందని, అయితే తాము వివిధ సంక్షేమ పథకాలకు ఖర్చు చేసే మెుత్తంలో అది అత్యల్ప శాతమేనని వివరించారు. కుర్చీలు, టేబుళ్ళ పై కూర్చొని భోజనం చేస్తే సహపంక్తి ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇక దళితుడి ఇంట్లో వండినట్లుగా చెబుతున్న వంటకాలు ఓ ఫాంహౌస్ లో తయారు చేసినవని ప్రకటించారు. అమిత్ షా జిమ్మిక్కులేవి తెలంగాణా ప్రజల ముందు పనిచేయవని స్పష్టం చేశారు.