తెరాస నేతల గుండెల్లో భయం: కోదండరామ్‌

SMTV Desk 2018-04-11 15:12:13   Telangana Jana Samithi, Kodandaram, Telangana Government

హైదరాబాద్‌, ఏప్రిల్ 11: ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా ఈ నెల 29న తెలంగాణ జన సమితి పార్టీ(టీజేఎస్‌) ఆవిర్భావ సభను నిర్వహించి తీరుతామని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. 100 సీట్లు గెలుస్తామన్నవారు తమకెందుకు భయపడుతున్నారని అడిగారు. తెరాస నేతల గుండెల్లో ఎక్కడో భయముందని కోదండరాం వ్యాఖ్యానించారు. ప్రజలకు నిజాలు తెలుస్తాయనే మా సభలకు, సమావేశాలకు అనుమతి ఇవ్వడంలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కోదండరామ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలపట్ల జవాబుదారీతో పనిచేయాలన్నారు. పాలన చట్టబద్ధంగా జరగాలని, అందరినీ సమానంగా చూడాలని పేర్కొన్నారు. ఆర్టికల్ 19ప్రకారం అందరికి స్వేచ్చ ఉండాలని...దేశభద్రతకు ముప్పు వాటిల్లినప్పుడే పరిమితులు విధించాలని...హక్కుల ప్రకారం ప్రభుత్వం నడుచుకోవాలని ఆయన వివరించారు.