విజయవాడ, ఏప్రిల్ 11: జ్యోతీరావు ఫూలే జయంతి ఉత్సవ వేడుకలు విజయవాడలో ఉద్రిక్తతకు దారితీసింది. జ్యోతీరావు విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించడానికి వచ్చిన సమయంలో, సీఎం చంద్రబాబు వస్తున్నారని పోలీసులు వారిని అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, పళ్లంరాజు, కనుమూరి బాపిరాజు తదితరులు అక్కడికి చేరుకొన్నారు. పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలూ నిరసనకు దిగగా స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి కేవీపీ, రఘువీరా తదితరులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. నేతలను ఎక్కించిన వాహనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అరెస్ట్ చేసిన వారిని పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు స్టేషన్ లోనే ఆందోళన చేపట్టారు. చంద్రబాబు సర్కారు దమనకాండకు ఈ ఘటన నిదర్శనమని కేవీపీ మండిపడ్డారు.