చెన్నై, ఏప్రిల్ 11 : ఐపీఎల్-11 అసలు మజా ఏంటో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రుచిచూపించింది. మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో కొనసాగిన ఉత్కంఠ... నిన్న కోల్కతా నైట్ రైడర్స్తో కూడా అలానే సాగింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ప్రత్యర్థి జట్టు 17 సిక్సర్లు కొట్టగా.. చెన్నై జట్టు 14 సిక్సర్లు బాదింది. ఇంతటి హోరాహోరి పోరు మధ్య అభిమానులకు ఓ చిత్రం ఆనందాన్ని ఇచ్చింది. అదేంటంటే.. గ్యాలరీలో ధోనీ కూతురు జీవాతో బాలీవుడ్ నటుడు, కేకేఆర్ సహా యజమాని షారుక్ఖాన్ సందడి చేశారు. టోర్నీలో భాగంగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్కు ధోనీ భార్య సాక్షి, కూతురు జీవా హాజరయ్యారు. పసుపు రంగు దుస్తుల్లో కనిపించి సందడి చేశారు. కొద్దిసేపటి షారుక్ ఖాన్.. జీవాతో కలిసి సందడి చేస్తూ కనిపించాడు. జీవాతో కలిసి షారుక్ సెల్ఫీ కూడా దిగాడు. ఇద్దరూ కలిసి మ్యాచ్లో ప్రధానాకర్షణగా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మ్యాచ్ లో కోల్కతా నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఒక బంతి మిగిలుండగానే ఛేదించి విజయం సాధించిన విషయం తెలిసిందే.