చెన్నై, ఏప్రిల్ 10 : ఐపీఎల్-11 సీజన్ కు గాను చెన్నై సూపర్కింగ్స్ జట్టు ఆటగాడు కేదార్ జాదవ్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. అతని స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ విల్లీని తీసుకుంది. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్ విల్లీ కుమారుడే డేవిడ్. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు పలురకాల కారణాలతో కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. ప్రపంచ క్రికెట్ లో మాయని మచ్చగా మిగిలిన బాల్ టాంపరింగ్ వివాదంతో స్మిత్, వార్నర్ ఈ సీజన్కు దూరం కాగా.. గాయాలతో మిచెల్ స్టార్క్, కాగిసో రబాడ టోర్నీ నుండి వైదొలిగారు. ఇప్పుడు ఈ జాబితాలో కేదార్ జాదవ్, కమిన్స్ కూడా చేరారు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు చమీర దుష్మంత వెన్నునొప్పి కారణంగా మూడు వారాల పాటు ఐపీఎల్కు దూరమయ్యాడు. రబాడ స్థానంలో బ్రిటిష్ ఆటగాడు లియామ్ ప్లంకెట్ను ఢిల్లీ డేర్డెవిల్స్ తీసుకోగా, ఇప్పుడు కేదార్ జాదవ్ స్థానాన్ని ఇంగ్లాండ్ ఆటగాడే భర్తీ చేశాడు. దీంతో ఇప్పటి వరకు ఈ ఏడాది ఐపీఎల్లో ఆడుతోన్న ఇంగ్లాండ్ ఆటగాళ్ల సంఖ్య 12కు చేరుకుంది.