చంద్రబాబుకు టీడీపీ ఎంపీల షాక్!

SMTV Desk 2018-04-10 13:39:13   Tdp mps, bus yatra, Special Category Status, Chandrabau naidu, andhra pradesh

అమరావతి, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటాన్ని తీవ్రతరం చేయాలనుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం ఎంపీలు షాక్‌ ఇచ్చారు. హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమాన్ని ముమ్మరం చేయడంతో అప్రమత్తమైన చంద్రబాబు ఆ పార్టీకి పోటీగా కార్యక్రమాలు రూపొందించాలనుకున్నారు. ఆ దిశంగా టీడీపీ ఎంపీలతో రాష్ట్రంలో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ యాత్రకు సంబంధించి రూట్‌ మ్యాప్‌పై చర్చించేందుకే ఢిల్లీలో ఉన్న ఎంపీలందరూ అమరావతికి రావాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే ఎంపీల బస్సు యాత్ర ద్వారా హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంతోపాటు ప్రస్తుతం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్రపై నుంచి జనం దృష్టి మరల్చడానికి చంద్రబాబు వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. అయితే అధినేత ప్రతిపాదించిన బస్సు యాత్రకు ఎంపీలు సముఖంగా లేకపోవండంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఎంపీలతో జరగాల్సిన సమావేశం కూడా నిర్వహించడం లేదని తెలుస్తోంది.